bhakthipathrika

కాలం అనంతం. దైవస్వరూపం. కాలమనే మంత్రదండాన్ని చేతపట్టుకుని భగవంతుడు స్వయంగా ఇంద్రజాలం చేస్తుంటాడు. వసంతం నుంచి శిశిరం వరకు ఎన్నెన్నో అద్భుతాలను మన కళ్లముందు ఆవిష్కరిస్తుంటాడు. కాలం రూపంలోనే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తుంటాడు. అటువంటి కాలానికి తొలివేకువ వంటి ఉగాది (ఏప్రిల్ 9) నవవసంతాన్ని మనకోసం మోసుకొస్తోంది. ఈ పండుగపూట ఉదయాన్నే తలస్నానం చేసి, షడ్రుచుల ప్రసాదం స్వీకరిస్తాం. ఏడాది పొడవునా దేశకాలమాన పరిస్థితులు, వ్యక్తిగత రాశి కందాయ ఫలాలు తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేస్తుంటాం. కొత్త ఏడాది అందరికీ శుభదాయకంగా గడవాలని కోరుకుందాం. 

ఉగాదినుంచే వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 17న శ్రీరామనవమి తెలుగువారికి మహోత్సవం. సీతారామ కల్యాణానికి ఊరూరా చలవ పందిళ్లు వెలుస్తాయి. భక్తులు పానకం, వడపప్పు ప్రసాదాలు పంచుతూ అందరికీ వేసవి ఎండనుంచి సేదదీరుస్తుంటారు. భద్రాచలంలోనూ, తెలుగునాట అన్ని ఆలయాల్లోనూ శ్రీరామ నవమినాడే కల్యాణాలు జరుగుతాయి. కానీ ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామచంద్రుని కల్యాణం నిండుపున్నమినాడు (ఏప్రిల్ 22) నిర్వహిస్తారు. శ్రీరాముని పేరు చెప్పగానే మానవాళి పులకించి పోతుంది. మనిషిగా పుట్టి, చక్రవర్తి కుమారునిగా జీవించి, మనలాగే అనేక కష్టసుఖాలను రుచిచూసినవాడు రాముడు. సాక్షాత్తూ ధర్మమే రామునిగా పోతపోసుకుంది. దుష్టశిక్షణకు పరిపూర్ణ మానవుడు మాత్రమే అర్హుడు అనే సందేశాన్ని శ్రీరాముడు మనకు అందించాడు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ధర్మరక్షణకు పాటుపడదాం. శ్రీరామకర్ణామృతంలో చెప్పినట్లు...
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
... అంటూ ఆ రామచంద్రునికి నమస్కరిద్దాం.

Read More