NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

పవిత్రమాసాల్లో వైశాఖం ఎంతో ముఖ్యమైనది. అక్షయ తృతీయతో వైశాఖ ప్రాశస్త్యం ప్రారంభమవుతుంది. మహాలక్ష్మికి ఇష్టమైన పర్వదినం అక్షయ తృతీయ. ఆనాడు చేసిన దానం, వ్రతం ఏదైనా అనంత పుణ్యబలాన్ని సంపాదించి పెడుతుంది. అక్షయ తృతీయ నేపధ్యంలోనే 19నాటి రాత్రి సింహాచలం అప్పన్నకు చందనోత్సవం జరుగుతుంది. ఆనాడే అప్పన్నస్వామి నిజరూప దర్శనభాగ్యం లభిస్తుంది. ఏడాది పొడవునా స్వామికి పూసి ఉంచే చందనాన్ని తొలగిస్తారు. మూడు విడతలుగా స్వామికి చందనం సమర్పిస్తారు. అక్షయ తృతీయనుంచే చార్ ధామ్ యాత్రలు ప్రారంభమవుతాయి. 27న అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం జరగనుంది. 

సత్యదేవుడు భక్తసులభుడు. చిన్నపత్రంతో కోరిన వరాలు కురిపిస్తాడు. ఆయన తెలుగువారి ఇలవేలుపు. ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా సత్యనారాయణ వ్రతం నిర్వహించుకుంటాం. అటువంటి సత్యదేవుని కల్యాణోత్సవ సంరంభాన్ని ప్రత్యక్షంగానూ, టీవీల ద్వారా పరోక్షంగానూ వీక్షించి తరిద్దాం. కోరిన వెంటనే భక్తుల కోర్కెలను నెరవేర్చే దైవం నృసింహుడు. ఆయన జయంతి పర్వం 30వ తేదీన రానున్నది. ఆ సందర్భంగా పరపు పావనమైన నృసింహ ఆవిర్భావ గాథలను స్మరించి పునీతులమవుదాం. వైశాఖం మహనీయుల జన్మోత్సవ పర్వంగా, నిత్యోత్సవమై భాసిల్లుతోంది. ఆదిశంకరులు, రామానుజులు, బసవేశ్వరుడు, వాసవీ కన్యక వంటి మహనీయుల జయంతులు ఈ నెలలోనే రానున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి, భగవాన్ రమణ మహర్షి, సత్యసాయిబాబాల ఆరాధన పర్వాలు కూడా ఈ మాసంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఆ మహాగురువుల సందేశాలను స్మరించి, వారు చూపిన వెలుగు బాటలో జీవితాలను తరింప చేసుకుందాం.

➠ తిరుమల శ్రీనివాసుని భక్తులలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబది విశిష్టస్థానం. తిరుమలలో చిరకాలం నివసించి, అక్కడ ఎన్నో విశిష్ఠ సంప్రదాయాలను ప్రారంభించిన పరమయోగిని. కవయిత్రిగానూ ‘వేంకటాచల మాహాత్మ్యం' వంటి గ్రంథాలు రచించింది.

➠ శ్రీమహావిష్ణువు ఆరో అవతారం పరశురాముడు. ఆయన గొప్ప మాతృభక్తుడు. సకల విద్యాకోవిదుడు. ఎందరికో గురువుగా విద్యాబోధన చేశాడు. అలా పరశురామునిలో భిన్నకోణాలు ఆవిష్కృతమవుతాయి. చిరంజీవులలో ఒకడైన పరశురాముడు ఆర్షవిద్యలు ఈ నేలపై విస్తరించడానికి కృషి చేశాడు.

➠ రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త. త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించ వలసిన ధైర్యానికి, దేవునిపై ఉంచాల్సిన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ రామానుజాచార్యుల జీవితం ఒక ఉదాహరణ. ఆయన బోధనలు సమసమాజ స్థాపనకు సోపానాలు.

➠ తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించకుండా తిరుమల యాత్ర పరిపూర్ణం కాదు. పద్మసరస్సులో పుట్టి ఆకాశరాజు కూతురుగా శ్రీనివాసుని చేపట్టిన అలమేలు మంగ సాక్షాత్తూ మహాలక్ష్మియే. పద్మావతీ శ్రీనివాసుల వార్షిక కల్యాణం వైశాఖమాసంలో నిర్వహిస్తారు.

➠ ఆర్యవైశ్యులందరికీ ఆరాధ్యదైవం వాసవీ మాత. ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన వాసవీ చరిత్ర ఎన్నదగినది. ఆమెను ఆర్యామహాదేవిగా కొలుస్తారు. పెనుగొండలో నగరేశ్వరస్వామి ఇల్లాలిగా ఆమె కొలువుదీరింది. దేశవిదేశాల్లో కన్యకా పరమేశ్వరి ఆలయాలెన్నో వెలిశాయి. ఆమె పేరుమీదుగా విస్తృత సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి.

➠ దుష్టసంహారం కోసం సద్యోమూర్తిగా ఆవిర్భవించినవాడు నృసింహుడు. ఆ స్వామి ఆవిర్భావ గాథను భాగవత నేపధ్యంలో సంస్కృతంలో వ్యాసుడు, తెలుగులో పోతన అభివర్ణించారు. విష్ణుపురాణం వంటి పురాణ గ్రంథాలు కూడా ఆ పావన గాథను విస్తారంగా తెలిపాయి.

Recent Comments