NOTE : ఇది కేవలం ఆన్లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్
ఆదిదేవునిగా, మహాదేవునిగా కైలాసనాథుడు అనాదిగా పూజలందుకుంటున్న దైవం. ఆడంబరాలు ఆర్భాటాలు లేని సామాన్యుల దేవర బోళా శంకరుడు. అటువంటి శివుడే లింగరూపిగా అవతరించిన రోజు మహాశివరాత్రి ఫిబ్రవరి 15. శివరాత్రి దినాన దేశంలోని శైవక్షేత్రాలన్నీ భక్తజనంతో కిటకిటలాడతాయి. 'హరహర మహాదేవ' ఘోషతో తెలుగునేల తడిసి ముద్దపుతుంది. శివరాత్రి ప్రభలతో కళకళలాడుతుంది. చిన్నా పెద్దా ఆడామగా అర్థరాత్రి లింగోద్భప పుణ్యకాలం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తారు. నిద్రాహారాలు మాని శివస్మరణతో గడుపుతారు. ఉపవాసాలతో, జాగరణలతో శివరాత్రి భళ్లున తెల్లారిపోతుంది. జాగారం పుణ్యమా అని శివరాత్రినాడు అనేక భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు వాడవాడలా జరుగుతాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి తెలుగునాట ఉన్న అతిపెద్ద శైవక్షేత్రాలతో సహా అనేక చోట్ల బ్రహ్మోత్సవాలు, కల్యాణాలు జరుగుతాయి. ‘జన్మకో శివరాత్రి' అని సామెత. జీవితంలో ఒక్క శివరాత్రినాడైనా స్వామిని భక్తితో సేవిస్తే మోక్షం లభిస్తుందంటారు. మాఘమాసం చివరిలో వచ్చే శివరాత్రి తరువాత ఫాల్గుణమాసం ప్రారంభమవుతుంది. అది నృసింహ కల్యాణాల మాసంగా ప్రసిద్ధి కెక్కింది.
తెలంగాణ తిరుమలగా పేరు తెచ్చుకున్న యాదాద్రిలో నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 18న నేత్రపర్వంగా ఆరంభం కానున్నాయి. కల్యాణ శుభవేళ నరసింహ దేవర మనందరినీ దీవించాలని మొక్కుకుందాం. ఈనెల 24న మంత్రాలయ గురురాఘవేంద్ర స్వామి జయంతి వస్తోంది. ఈ సందర్భంగా గురురాయల ప్రబోధాలను స్మరించి, వారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఇంకా ఈనెలలో అనేక క్షేత్రాలలో దేవీదేవతల కల్యాణాలు, మహోత్సవాలు జరగనున్నాయి. ఆయా దేవతలందరూ మనల్ని నిండుగా అనుగ్రహించాలని సభక్తికంగా కోరుకుంటున్నాం.
➠ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని తెలంగాణ తిరుమలగా పిలుచుకుంటారు. పంచనారసింహ క్షేత్రంగా భావిస్తారు. యాదర్షి కోరిక మేరకు త్రేతాయుగంలో ఇక్కడ స్వామి దక్షిణాభిముఖంగా వెలిశాడు. ఫాల్గుణ మాసంలో యాదగిరీశునికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగిన 11 రోజులూ యాదగిరిగుట్ట ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది.
➠ నరసింహుడు ఆవిర్భవించిన దివ్యక్షేత్రం అహోబిలం. నవనారసింహ మూర్తులుగా అదే క్షేత్రంలో తొమ్మిది చోట్ల అవతరించాడు. నవనారసింహ క్షేత్రమైన అహోబిలంలో ఫాల్గుణమాసంలో కల్యాణోత్సవ ప్రయుక్తంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు 45 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి.
➠ యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం. ఇలలో వెలసిన కైలాసం. కోరినవన్నీ అనుగ్రహించే క్షేత్రం. శ్రీశైలంలో ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, మహాశివరాత్రికి మరోసారి చొప్పున రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం. కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 08 నుండి 18 వరకు జరగనున్నాయి.
➠ రామకృష్ణ పరమహంస జయంతి. పరమాత్మను తెలుసుకోవడానికి మతాలన్నీ వేర్వేరు మార్గాలు. ఏ మార్గంలో ప్రయాణించినా భగవంతుని చేరుకోవచ్చని నిరూపించారు రామకృష్ణ పరమహంస. హిందూధర్మం ప్రబోధించిన మార్గాలే కాకుండా ఇతర మతమార్గాలలో సైతం పయనించి పరమహంసగా రూపుదిద్దుకున్నారు. స్వామి వివేకానందుని వంటి మహోన్నత శిష్యుణ్ణి జాతికి అందించారు.
➠ ఫాల్గుణమాసం శుద్ధ విదియ మంత్రాలయ రాఘవేంద్రస్వామి సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు. సప్తమి తిథి వారి జయంతి. 1595 మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం నాడు స్వామి ఉదయించారు. ఈ రెండు సందర్భాల నేపధ్యంలో ఏటా మంత్రాలయంలో గురువైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది గురురాఘవేంద్రుల జయంతి ఫిబ్రవరి 24న వచ్చింది.
➠ మాఘమాసంలోని ఇరవై తొమ్మిదో రోజును మహాశివరాత్రిగా పిలుస్తారు. పూర్వయుగాలలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఏర్పడిన తగాదాను తీర్చడానికి పరమేశ్వరుడు అగ్ని లింగంగా ఆవిర్భవించిన పుణ్యక్షణమే మహాశివరాత్రి. జగత్తు అంతటా ఉంటూ, దీనికి వెలుపల కూడా ఉన్నది శివతత్త్వమే అని నిరూపించేది మహాశివరాత్రి. ఆనాడు ఉపవాస, జాగరణలతో భక్తులు బోళాశంకరుడిని మెప్పిస్తారు.