జన్మకో శివరాత్రి అని సామెత. మహాశివరాత్రినాడైనా ఉపవాసంతో, జాగరంతో, అభిషేకంతో శివుని మెప్పించాలి. తనకోసం ఏ చిన్నపని చేసినా వెంటనే దానిని స్వీకరించే అల్ప సంతోషి శివుడు. మనకు ఉన్నదానితోనే సంతోషించాలని, బయటెక్కడో వెతకడం కంటే మనలోనే ఆనందాన్ని అన్వేషించి తెలుసుకోవాలని మనకు తెలియచెప్పే మహత్తర పర్వదినం శివరాత్రి. ఆ రోజున ప్రతి శివాలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. ప్రతి చిన్న గుడిలోనూ మహాదేవుడు నిర్విరామంగా దర్శనాలు అనుగ్రహిస్తాడు. ఊరూవాడా తిరునాళ్లు, జాతరలు కోలాహలంగా సాగుతాయి. తెలుగునాట శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి చోట్ల బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆలయలకు పోటెత్తుతారు. ‘హరహర మహాదేవ, ఓం నమఃశివాయ’ అని చేతులెత్తి మొక్కే ప్రతి భక్తుడి మొరనూ ఆలకించే పరమేశ్వరుడు మనకు మనోబలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుందాం. మాఘం పర్వదినాలకు పెట్టింది పేరైతే, ఫాల్గుణమాసం నృసింహ కల్యాణాల మాసంగా చెబుతారు. 

తెలంగాణ తిరుపతిగా భక్తులందరూ పిలుచుకునే యాదాద్రిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 18న స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం జరుగుతుంది. అలాగే వివిధ నృసింహ క్షేత్రాల్లో కూడా ఈ ఫాల్గుణమాసంలోనే వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. శివుని వలెనే నృసింహుడు కూడా మనం కోరిన కోరికలు అడిగినవెంటనే తీరుస్తాడంటారు. ఆ స్వామికి మొక్కి మనోభీష్టులు నెరవేర్చుకుందాం. భక్తులపాలిట కల్పవృక్షంగా, కామధేనువుగా ప్రసిద్ధి వహించిన గురురాఘవేంద్రస్వామి జయింతి మహోత్సవాల సందర్భంగా మంత్రాలయ క్షేత్రాన్ని వేలాదిమంది సందర్శించుకుంటారు. ఆ మహాగురుని అనుగ్రహ ఆశీస్సులు పొంది తరిస్తుంటారు. ఏడాదిలో చిట్టచివరి పౌర్ణమి అయిన ఫాల్గుణ పౌర్ణమిని ఆటపాటల్లో ముగించడం మన సంప్రదాయం. హోళీ (మార్చి 25) వేడుకల్లో సహజమైన రంగులనే వాడుదాం. ఫాల్గుణమాసం మనలో ఆనందాన్ని ఉత్సాహాన్ని అత్యంత  సహజశైలిలో పెంపొందింపచేయాలి.

➠ భారతీయ సంస్కృతి ఒక రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా మనలో ఆనందాలు నింపే పండుగలతో శోభిస్తుంది. వసంత రుతువు ప్రారంభంలో వచ్చే హోళీ అయితే చెప్పనే అక్కరలేదు. వయోభేదాలు మరిచి అందరూ వసంతాలాడి మైమరిచే రంగుల పండుగ హోళీ. ఆనందహేల అయిన హోళీ వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయి.

➠ శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యంలో తిన్నడి వంటి భక్తుల గురించి రాసినా, శ్రీకాళహస్తుల వంటి జంతువుల గురించి రాసినా, నత్కీరుడి వంటి మహాకవుల గురించి రాసినా శైవ మహిమల్ని ఆవిష్కరించడమే పరమార్థంగా సాగటం ధూర్జటి రచన ప్రత్యేకత. శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని మించిన భక్తికావ్యం నేటివరకు లేదంటే అతిశయోక్తి కాదు.

➠ 1595 మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం నాడు మంత్రాలయ గురురాఘవేంద్రులు ఉదయించారు. వారు ఫాల్గుణమాసంలోని శుద్ధ విదియనాడు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఈ రెండు సందర్భాల నేపధ్యంలో ఏటా మంత్రాలయంలో గురువైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మార్చి 16న గురు రాఘవేంద్రస్వామి జయంతి తిథి వస్తోంది.

➠ తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి. అన్ని నృసింహ క్షేత్రాలలాగానే ఫాల్గుణమాసంలో ఆ స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవ, రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేలాది భక్తులు ఆ సందర్భంలో స్వామిని దర్శించుకుంటారు.

➠ శివరాత్రి అంటే జాగారం. శివరాత్రి అంటే ఉపవాసం. ఆరోజు అభిషేకాలలో మహాశివుడు నానుతూ ఉంటాడు. మారేడు దళాలలో మునిగి ఉంటాడు. విబూది రేఖలలో వెలిగిపోతూ ఉంటాడు. అసలే బోళాశంకరుడు, ఆపైన శివరాత్రి. ఈ పర్వదినాన నిప్రనియమాలతో ప్రసన్నం చేసుకుంటే మహాశివుడు వరాలు కురిపిస్తాడు.

➠ దక్షిణాదిన నెలకొన్న పంచభూతలింగాలలో అరుణాచలం ఒకటి. ఇది అగ్నిలింగం. అగ్నివలె ఎర్రని కొండ కనుక దీనిని అరుణాచలం అని పిలుస్తారు. పౌర్ణమిరోజుల్లోనూ, కృత్తికా దీపోత్సవంలోనూ, శివరాత్రి వంటి పర్వదినాల్లోనూ లక్షలాదిగా శివభక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ శివునికి ప్రదక్షిణ చేసినట్లే అని భావిస్తారు.

Recent Comments