ప్రకృతి కాంత నెన్నుదుటన పైడిబొట్టు ప్రథమ ఋతువు వసంతమై వచ్చెనిపుడు... అంటూ కవులు చైత్రానికి స్వాగత గీతాలు పలుకుతుంటారు. వనాలకు లేతచివుళ్లు తొడిగిన వసంతం... మనందరి ఆశలకూ ప్రాణం పోస్తుంది. చైత్రంలోని మొదటిరోజునే మనకు ఉగాది. చాంద్రమానం పాటించే మనందరికీ ఆ రోజుతోనే ఏడాది మొదలవుతుంది. మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఉగాది పండుగ పేరు చెప్పగానే పచ్చడి ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఆ ప్రసాదం వలె జీవితంలో చేదు, తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు కలగలిసి ఉంటాయని.... కాలంతో పాటు మనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ..... ఆరురుచుల కలబోతగా జీవితాలను ఆనందంగా గడపాలని సూచించేందుకే ఈ పచ్చడి ప్రసాదం తీసుకోవాలి. అలాగే ఉగాదినాడు మనందరం తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేస్తుంటాం. నవనాయక నిర్ణయాలు కొత్త ఏడాదిలో దేశ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియచేస్తాయి. రాశిఫలితాలు ఒక్కొక్క రాశిలోని వారికి జీవితంలో జరగబోయే ముఖ్యఘట్టాలను సూచనలుగా చెబుతుంటాయి. ఉగాది సందేశాన్ని స్వీకరించి ఆనందంగా గడుపుదాము. ఉగాదికంటే ముందుగా ఫాల్గుణ పూర్ణిమ రంగుల హోళీని (మార్చి 14) తీసుకు వస్తుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వసంతాలు ఆడుకుని ఆనందంగా జరుపుకునే పండుగ హోళీ. 

ఈ ఫాల్గుణంలోనే లక్ష్మీనృసింహ కల్యాణాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా మార్చి నెలలోనే అనేక నృసింహ క్షేత్రాలలో కల్యాణాలు, తీర్థాలు జరుగుతుంటాయి. నారసింహ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఈ సంచికలో పంచాంగకర్తలు తెలియచేసిన పంచాంగ ఫలితాలు, పన్నెండు రాశులవారికీ వర్తించే రాశిఫలాలతో పాటుగా అనేక కొత్త సంవత్సర విశేషాలను పొందుపరిచాం. అందుకోండి. ఈ నూతన సంవత్సరం మనందరికీ నిత్యకల్యాణం పచ్చతోరణంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాము.

➠ ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమనాడు జరుపుకొనే పండుగ హోలీ. ఈ పండుగ ఆవిర్భావం వెనుక దేశమంతటా ప్రాంతీయంగా అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. కామం అంటే కోరిక అని అర్థం. మనిషిలోని కోరికలను దహింపచేసుకొని అన్నివిధాలా శాంతిని పొందమని చెప్పే సూచన కూడా ఈ పర్వదినం ఆచరణలో కనిపిస్తోంది.

➠ లక్ష్మి అంటే ఎవరిచేతనూ తిరస్కరించరానిది అని అర్థం. ఆమెను ప్రతివారూ ఆరాధిస్తారు. పూజిస్తారు. తమ ఇంటికి విచ్చేయమని ఆహ్వానిస్తారు. పై రెండు హస్తాలలో పద్మాలను ధరించి.. కిందనున్న కుడి హస్తంతో బంగారు కాసులను కురిపిస్తూ.. ఎడమ హస్తాన్ని వరదహస్తంగా ధరించి... పద్మంపై ఆశీనురాలై లక్ష్మి దర్శనమిస్తుంది.

➠ సనాతన ధర్మాన్ని ఉద్దీపన చేయడానికి ఈ నేలపై ఎందరో యోగులు, యతీశ్వరులు, మహనీయులు ఆవిర్భవించారు. వారి మార్గదర్శకత్వంలో, వారు చేసిన ప్రబోధాలతో మనదేశం సుసంపన్నమైంది. ఆ పరంపరలోనే సద్గురు రాఘవేంద్ర యతీంద్రులు అనంత శిష్యకోటిని సముద్ధరించడానికి కారణజన్ముడిగా అవతరించారు.

➠ కుంభమేళా అనే పేరు వినగానే మహోన్నతమైన ఆధ్యాత్మిక భావనలు మనసులను ముప్పిరిగొంటాయి. ఈ సంవత్సరం ప్రయాగరాజ్ లోని త్రివేణీ సంగమానికి నిర్వహించిన మహాకుంభమేళాలో దాదాపు 50 కోట్లమందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచమంతా భారతదేశం వైపు తలతిప్పి చూసేలా మహాకుంభమేళా నిర్వహణ జరిగింది.

➠ తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి. అన్ని నృసింహ క్షేత్రాలలాగానే ఫాల్గుణమాసంలో ఆ స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవ, రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేలాది భక్తులు ఆ సందర్భంలో స్వామిని దర్శించుకుంటారు.

➠ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి సూర్యోదయ ఘటికల్లో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధువు, ధర్మసింధువు, హేమాద్రిఖండం మొదలైనవి ఈ పండుగ ప్రత్యేకతను వివరించాయి. భూగోళ, ఖగోళ, ప్రకృతి, పర్యావరణ పరిశీలన ఉగాది నిర్ణయంలో కనిపిస్తుంది. తెలుగువారు ఈ పండుగను తెలుగుతనంతో కలబోశారు.

Recent Comments