చూసి రమ్మంటే కాల్చి వచ్చే దక్షతగల కార్యశీలి హనుమంతుడు. అపరిమిత శక్తి సంపన్నుడే కాకుండా గొప్ప మాటకారిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవిగా, విశిష్టదైవంగా దివ్యకీర్తిని పొందాడు. హనుమంతుని శరణువేడితే అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. హనుమంతుడు నిష్ఠకు, సేవా పరాయణత్వానికి ప్రతీక. ఆయనను సేవిస్తే సకల భోగాలనూ అనుగ్రహిస్తాడని ప్రతీతి. హనుమజ్జయంతి శుభవేళ (మే 22) ఆ శ్రీరామదూతకు జయము పలుకుదాం. కోరిన వెంటనే భక్తులకు అన్ని వరాలనూ అనుగ్రహించే దైవం నృసింహుడు. మే 10న సృసింహ జయంతి సందర్భంగా ఆ స్వామికి కైమోడ్చుదాం. చల్లగా చూడమని వేడుకుందాం.
అన్నవరం సత్యదేవుడు భక్త సులభుడు. చిన్నవ్రతంతో కోరిన వరాలు కురిపిస్తాడు. ఆయన తెలుగువారికి ఇలవేలుపు. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వెనువెంటనే సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటాం. అటువంటి సత్యదేవుడు వెలిసిన అన్నవరంలో శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం 8వ తేదీన జరగనుంది. అందులో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం. అద్వైతమూర్తి ఆదిశంకరాచార్యుని జయంతి (మే 2) వైశాఖమాసానికి వన్నె తెస్తుంది. సమతామూర్తి రామానుజుని పుట్టినరోజు కూడా అదే రోజు రావడం విశేషం. లోకానికి అహింసా మార్గాన్ని బోధించిన మహనీయుడు బుద్ధుడు. ఆయన జయంతి బుద్ధపూర్ణిమ మే 12 సందర్భంగా ఆయన ప్రబోధాలను నెమరేసుకుందాం. రాశిచక్రంలో గురుడు రాశి మారినప్పుడల్లా మన పుణ్యనదులకు పుష్కరాలు వస్తుంటాయి. మే 15 నుంచి 26 వరకు సరస్వతీనదికి పుష్కరాలు రానున్నాయి. పుష్కరాల విధులను మన తెలుగువారు తప్పక పాటిస్తుంటారు. ఆ పుణ్యసమయంలో నదీస్నానం, దానాలు చేస్తుంటారు. మనదేశంలో సరస్వతీనది ఎండిపోయినప్పటికీ... కొన్నిచోట్ల ఆ నది ఆసవాళ్లు గుర్తించారు. తెలంగాణలోని కాళేశ్వరంతో పాటుగా ఆయా ప్రదేశాల్లో పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఆ నదీమ తల్లి మనల్ని కరుణించాలని వేడుకుందాం.
➠ నిత్యకల్యాణ వైభవ సంపన్నుడు శ్రీనివాసుడు. ద్వారకా తిరుమలలో ఏటా రెండుసార్లు తిరు కల్యాణ మహోత్సవాలు అదనంగా జరిపించుకుంటాడు. ఆ వేంకటేశుని వైశాఖ తిరు కల్యాణోత్సవాల సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చేనెల 2 వరకూ వివిధ అలంకారాలతో, వాహన సేవలతో ద్వారకా తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా మారుతుంది.
➠ నెమ్మదిగా నడుస్తాడు కాబట్టి శనికి మందుడని పేరు. నవగ్రహాలలో శనిది కర్మాధికారి స్థానం. ఫలితాలను అందించడంలో మాత్రం శని అత్యంత వేగంగా, ప్రభావశీలంగా పనిచేస్తాడు. క్రూర గ్రహాలుగా జ్యోతిశ్శాస్త్రం చెప్పిన శనిగ్రహం అంటే చాలమంది భయపడతారు. ప్రజల్లో శనిదోషాల పట్ల ఉన్న అపోహలు స్వార్ధపరుల చేతిలో మోసపోవడానికి కారణమవుతున్నాయి.
➠ దేవభూమి అని పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘరవాల్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన క్షేత్రాలలో నాలుగు క్షేత్రాలు అతి ముఖ్యమైనవి. గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బదరీ నాథ్ అనేవి ఆ నాలుగు క్షేత్రాలు. ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అంటారు. ఈ నాలుగు క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించడాన్ని చార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు.
➠ బౌద్ధ సంప్రదాయం ప్రకారం బుద్ధత్వమనేది మానవీయతకు పరాకాష్ఠ. ఆ మానవీయతా శిఖరానికి చేరిన ఎవరైనా బుద్ధుడు కావచ్చు. సిద్ధార్థ రాకుమారుడు ఆవిధంగానే బుద్ధుడయ్యాడు. బుద్ధత్వమనేది పుట్టుకతో సంక్రమించేదికాదు. కులాన్ని, వంశాన్ని, ప్రాంతాన్నిబట్టి వచ్చేదికాదు. సాధనతో సాధించుకునే ఓ మహోన్నత గుణం. ఈ గుణాల్ని మనసా, వాచా, కర్మణా ఆచరించడమే బుద్ధత్వం.
➠ ఉత్సవమంటే ఉత్కృష్టమైన రసాన్ని పిండుకోవటమని అర్థం. జయంత్యుత్సవం నాడు విశిష్టులైన గుణకర్మలను విశ్లేషించుకోవాలి. వాటిని సాధ్యమైనంత వరకు అనుసరిస్తూ, అనుకరించడానికి ప్రయత్నించాలి. ఆ మహానుభావుణ్ణి గుర్తు చేసుకొని, మహదానందరసాన్ని పిండుకొని ఆస్వాదించే సమయం జయంతి. ఉగ్రత్వం ఉట్టిపడే నరసింహస్వామి అవతారం వెనుక ఎన్నో యోగరహస్యాలున్నాయి.
➠ రుద్రాంశ సంభూతుడు... పరమ రామభక్త శిఖామణి ఆంజనేయుడు. తలచిన వారికి తలపులలోని అభీష్టాలను సిద్ధింప చేస్తాడు. ఆర్తితో పిలిచేవారికి ఆపన్నవరద హస్తం అందించే సులభసాధ్యుడైన దైవం ఆంజనేయస్వామి. హనుమజ్జయంతి మంగళవేళ ఆయన రూపాలలో అత్యంత మహిమాన్వితం అయిన పంచముఖాంజనేయ తత్త్వాన్ని స్మరించుకుందాం.