NOTE : ఇది కేవలం ఆన్లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం
హనుమకు సాటిరాగల దైవం హనుమ ఒక్కడే! విలక్షణమైన వ్యక్తిత్వం ఆయనది. ఆదర్శ మానవుడిగా అవతరించిన శ్రీరాముడికి సమ్మినబంటుగా అంకితమైన వాడు. రామబంటు అయినా ఆ రామునికి దీటుగా సాటిలేని దైవంగా నిలిచాడు. ఆయన అసాధారణ శక్తి సంపన్నుడు. వినయం, వందనం, మాటపొందిక క్షుణ్ణంగా తెలిసినవాడు. కార్యశూరుడు. యుగయుగాలుగా ధర్మానికి వెన్నెముకగా నిలిచిన వాడు. తన గుణగణాలతో మానవాళికి పూజనీయుడై, ఊరూరా ఆలయాల్లో కొలువుతీరాడు. హనుమజ్జయంతి (మే 12) సందర్భంగా ఆ స్వామిని శరణువేడుదాం.
సమస్త మానవజాతి రుగ్మతలను బాపిన మహనీయుడు. బుద్ధుడు. కరుణ త్యాగం కలగలిసి మూర్తీభవించిన రూపం బుద్ధుడు. గౌతమ బుద్ధుడు శాక్యవంశంలో జన్మించి నేటికి రెండున్నర వేల సంవత్సరాలైనా ఆయన ఉపదేశాలు నేటికీ వన్నె తగ్గలేదు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం బుద్ధత్వమనేది మానవీయతకు పరాకాష్ఠ. బౌద్ధం చెప్పే మహోన్నత గుణాల్ని మనసా, వాచా, కర్మణా ఆచరించడమే బుద్ధత్వం. బుద్ధ పూర్ణిమ (మే 1) సందర్భంగా గౌతమ బుద్దుని బోధనల సారాంశంపై సరికొత్త చూపును సారించాలి.
మే 25వ తేదీన దశపాపహర దశమి. మన పుణ్యనదుల్లో మొదటిదైన గంగ పుట్టినరోజు. మానవకోటి సకల కల్మషాలనూ గంగ కడిగి వేస్తుందని విశ్వసిస్తారు. అలా గంగ కడిగివేసే పదిరకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించినదే గంగాదశమి. ఆనాడు ఆ మాతను స్మరించి, నమస్కరిద్దాం. ఇంకా పవిత్ర వైశాఖమాసం ముగుస్తున్న వేళ వివిధ క్షేత్రాల్లో దేవీదేవతల ఉత్సవాలు, కల్యాణాలు జరగనున్నాయి. ఆ దేవతలందరూ మనల్ని చల్లగా కాపాడాలని మనసారా కోరుకుందాం.
➠ తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మహిమాన్వితమైన ఆరుపడై వీడులలో ఒకటి. ఇక్కడ జరిగే సుబ్రహ్మణ్య మహాభిషేకం భక్తులకు కనువిందు చేస్తుంది. తిరుత్తణిలో చందన అభిషేకం చాలా ప్రత్యేకం. స్వామివారికి అర్పించిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.
➠ తిరుపతి గంగమ్మ ఆలయానికి 900 ఏళ్ల పురాతన చరిత్ర ఉంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర, ఏటా మే నెలలో ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సోదరిగా భావించే గ్రామదేవతకు జరిగే పూజా కార్యక్రమం. ఈ జాతరలో భాగంగా భక్తులు వివిధ రకాల వేషధారణలు (బైరాగి, బండ, తోటి వేషాలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.
➠ కర్నూలు జిల్లాలోని ఒక చిన్న పట్టణం ఆదోని. ఇప్పుడు యాత్రాస్థలం. ఆశ్రిత జన కల్పవల్లిగా ప్రశంసలందుకుంటున్న అమృత స్వరూపిణి ఆదోని తిక్క లక్ష్మమ్మ సిద్ధి పొందిన ప్రదేశంగా కీర్తి పొందింది. ఆంధ్రదేశంలో యోగులకు కొదవలేదు. జీవితకాలంలో భౌతిక శరీరంతోనూ సమాధి చెందిన తరువాత సూక్ష్మ శరీరంతోనూ భక్తుల పూజలు అందుకొంటున్న అవధూత ఆదోని తిక్క లక్ష్మవ్వ.
➠ నారదుడి గురించి పురాణాలలో తరచు కనిపిస్తుంటుంది. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ వర్ణిస్తుంటారు. తెలుగు సాహిత్యంలోనూ, చలన చిత్రాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావితమవుతుంటాయి. ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలలో నారదుని గురించిన కథలు ఎన్నెన్నో ఉన్నాయి.
➠ గంగ పుట్టిన రోజే దశపాపహర దశమి. దీనినే దశహర అని కూడా పిలుస్తారు. మనలోని సకల కల్మషాలనూ గంగ కడిగివేయగలదని చెబుతారు. అలా గంగ కడిగివేసే పదిరకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించినదే గంగాదశమి. పాపాలు మూడు రకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతాయి. కాయిక, వాచిక, మానసిక పాపాలలో పదిరకాలైన పాపాలను గంగాదేవి కడిగివేస్తుంది.
➠ శని అనే పేరు వినగానే చాలామంది కలవర పడతారు. ఆయన హాని కారకుడన్న నమ్మకం స్థిరపడిపోవడమే దీనికి కారణం. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాలు తొమ్మిది. వాటి సంచారం, గమన విధానం వల్ల ప్రకృతిలో, వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయి. అలా ప్రభావం చూపే నవగ్రహాల్లో శనిది ఏడో స్థానం. వైశాఖ అమావాస్య నాడు శని జయంతి.
➠ దిగువ తిరుపతిలో కొలువుదీరిన శయనమూర్తిగా కొలువుదీరిన గోవిందరాజస్వామి వేంకటేశ్వరస్వామి సోదరుడిగా గుర్తింపు పొందాడు. ఎత్తయిన గోపురాలతో... విశాలమైన మండపాలతో... అద్భుతమైన శిల్పకళా సంపదతో... విశాలమైన ప్రాంగణంలో తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఆ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
➠ శ్రీమహావిష్ణువు వరదరాజస్వామి పేరుతో కంచిలో కొలువుదీరాడు. ఇది విష్ణుకంచిలో ఉన్న ఆలయాలలో ప్రధాన ఆలయం. వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా తమిళ పంచాంగం ప్రకారం పదిరోజుల పాటు జరుగుతాయి. వివిధ వాహనసేవలతో పాటూ 7వ నాడు జరిగే రథోత్సవం కన్నుల పండువగా ఉంటుంది.
➠ ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం ఆంజనేయ స్వరూపం. అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణు తేజస్సుతో రాముడు, శక్తిరూపంగా సీతమ్మ, రుద్రునిగా హనుమ వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమాన ప్రాధాన్యంతో పూర్ణ దేవతామూర్తులుగా రామాయణంలో దర్శనమిస్తారు. వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి సందర్భంగా ఆ స్వామి తత్త్వావిష్కరణ.