శతమూలా శతాంకురా... అంటూ దేవీసూక్తం వంద సంఖ్యను పూర్ణత్వానికి ప్రతీకగా చెప్పింది. ఓ పత్రిక కావచ్చు... ఓ సంస్థ కావచ్చు... ఓ జీవితం కావచ్చు... వందకు చేరువకావడం ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టే సందర్భం. గోదారమ్మ పుష్కర పేరంటం సాక్షిగా 2015 జూలై నెలలో ప్రారంభమైన భక్తిపత్రిక ఈ మాసంతో 100వ సంచికగా మీ కరకమలాలను అలంకరించింది. మన సంస్కృతీ సంప్రదాయాల్లోని గొప్పదనం సామాన్యులకు కూడా అర్థం కావాలనే సంకల్పంతో భక్తిపత్రికను ప్రారంభించాం. మా సంకల్పానికి ఎంతోమంది ఆధ్యాత్మిక పండితులు, పండితులు తమ రచనలతో వెన్నుదన్నుగా నిలిచారు. ఎంతో కఠినమైన విషయాలను కూడా సులభశైలిలో అందిస్తున్న భక్తిపత్రికను మొదటి అడుగునుంచే పాఠకులు అక్కున చేర్చుకున్నారు. ఇంటింటా ధర్మజ్యోతిగా, తెలుగువారి ఆధ్యాత్మిక కరదీపికగా మీ అందరి సహాయ సహకారాల వల్లనే భక్తిపత్రిక వెలుగొందుతోంది. 100వ సంచిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్న పాఠకులకు, ప్రకటన కర్తలకు శుభాకాంక్షలు అందచేస్తున్నాం. మునుముందు పత్రికను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు.. మీ అందరి సహకారం ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.
ఈ విజయానంద సందర్భంలోనే విజయదశమి పర్వదినం కూడా (అక్టోబర్ 23) విచ్చేస్తోంది. సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతుమే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ అనంతంగా సాగిపోయే ఈ చరాచర సృష్టిని జగన్మాత తానే అన్నింటికీ బీజమై పోషిస్తోంది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా శక్తి స్వరూపిణిని నవరూపాలలో తొమ్మిది రోజులపాటు ఆరాధించి తరిస్తారు. బొమ్మల కొలువులు, పూజలు, ఉత్సవాలు, వ్రతాలతో ఆసేతు హిమాచలం దుర్గమ్మ కోవెలగా భాసిల్లుతుంది. తెలంగాణ ప్రజలు ‘బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ జగన్మాతను పూలతో తయారుచేసి పూజిస్తారు. బంగారు బతుకమ్మలు... వాడవాడలా వెలిసే దుర్గమ్మలు మన కోరికలన్నీ నెరవేర్చి, అందరికీ ఆనందాలు పంచిపెట్టాలని కోరుతున్నాం.