bhakthipathrika

ప్రకృతి కాంత నెన్నుదుటన పైడిబొట్టు ప్రథమ ఋతువు వసంతమై వచ్చెనిపుడు... అంటూ కవులు చైత్రానికి స్వాగత గీతాలు పలుకుతుంటారు. వనాలకు లేతచివుళ్లు తొడిగిన వసంతం... మనందరి ఆశలకూ ప్రాణం పోస్తుంది. చైత్రంలోని మొదటిరోజునే మనకు ఉగాది. చాంద్రమానం పాటించే మనందరికీ ఆ రోజుతోనే ఏడాది మొదలవుతుంది. మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఉగాది పండుగ పేరు చెప్పగానే పచ్చడి ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఆ ప్రసాదం వలె జీవితంలో చేదు, తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు కలగలిసి ఉంటాయని.... కాలంతో పాటు మనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ..... ఆరురుచుల కలబోతగా జీవితాలను ఆనందంగా గడపాలని సూచించేందుకే ఈ పచ్చడి ప్రసాదం తీసుకోవాలి. అలాగే ఉగాదినాడు మనందరం తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేస్తుంటాం. నవనాయక నిర్ణయాలు కొత్త ఏడాదిలో దేశ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియచేస్తాయి. రాశిఫలితాలు ఒక్కొక్క రాశిలోని వారికి జీవితంలో జరగబోయే ముఖ్యఘట్టాలను సూచనలుగా చెబుతుంటాయి. ఉగాది సందేశాన్ని స్వీకరించి ఆనందంగా గడుపుదాము. ఉగాదికంటే ముందుగా ఫాల్గుణ పూర్ణిమ రంగుల హోళీని (మార్చి 14) తీసుకు వస్తుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వసంతాలు ఆడుకుని ఆనందంగా జరుపుకునే పండుగ హోళీ. 

ఈ ఫాల్గుణంలోనే లక్ష్మీనృసింహ కల్యాణాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా మార్చి నెలలోనే అనేక నృసింహ క్షేత్రాలలో కల్యాణాలు, తీర్థాలు జరుగుతుంటాయి. నారసింహ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఈ సంచికలో పంచాంగకర్తలు తెలియచేసిన పంచాంగ ఫలితాలు, పన్నెండు రాశులవారికీ వర్తించే రాశిఫలాలతో పాటుగా అనేక కొత్త సంవత్సర విశేషాలను పొందుపరిచాం. అందుకోండి. ఈ నూతన సంవత్సరం మనందరికీ నిత్యకల్యాణం పచ్చతోరణంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాము.

Read More