దీపం జ్యోతిః పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీప నమోస్తుతే
ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించ గలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటిరోజు నుంచి మనకు కార్తిక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై భాసిస్తుంటాయి. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందుతరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తిటీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.
ఏటా కార్తికమాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాలనుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలు అందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందచేస్తున్నారు. అతిరథ మహారథుల అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాదిమంది ప్రజలు వెలిగించిన కోటిదీపాలు వెలుగుతుంటే భక్తకోటి తన్మయమవుతుంది. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా... ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే... అన్నరీతిలో అందరి ప్రశంసలూ అందుకుంటూ... ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషంగా భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.
నవంబర్ 14 నుంచి 27 వరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా... ఈసారి నిర్వహించబోయే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి మీరందరూ సకుటుంబంగా తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరుతున్నాం.