చూసి రమ్మంటే కాల్చి వచ్చే దక్షతగల కార్యశీలి హనుమంతుడు. అపరిమిత శక్తి సంపన్నుడే కాకుండా గొప్ప మాటకారిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవిగా, విశిష్టదైవంగా దివ్యకీర్తిని పొందాడు. హనుమంతుని శరణువేడితే అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. హనుమంతుడు నిష్ఠకు, సేవా పరాయణత్వానికి ప్రతీక. ఆయనను సేవిస్తే సకల భోగాలనూ అనుగ్రహిస్తాడని ప్రతీతి. హనుమజ్జయంతి శుభవేళ (మే 22) ఆ శ్రీరామదూతకు జయము పలుకుదాం. కోరిన వెంటనే భక్తులకు అన్ని వరాలనూ అనుగ్రహించే దైవం నృసింహుడు. మే 10న సృసింహ జయంతి సందర్భంగా ఆ స్వామికి కైమోడ్చుదాం. చల్లగా చూడమని వేడుకుందాం.
అన్నవరం సత్యదేవుడు భక్త సులభుడు. చిన్నవ్రతంతో కోరిన వరాలు కురిపిస్తాడు. ఆయన తెలుగువారికి ఇలవేలుపు. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వెనువెంటనే సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటాం. అటువంటి సత్యదేవుడు వెలిసిన అన్నవరంలో శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం 8వ తేదీన జరగనుంది. అందులో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం. అద్వైతమూర్తి ఆదిశంకరాచార్యుని జయంతి (మే 2) వైశాఖమాసానికి వన్నె తెస్తుంది. సమతామూర్తి రామానుజుని పుట్టినరోజు కూడా అదే రోజు రావడం విశేషం. లోకానికి అహింసా మార్గాన్ని బోధించిన మహనీయుడు బుద్ధుడు. ఆయన జయంతి బుద్ధపూర్ణిమ మే 12 సందర్భంగా ఆయన ప్రబోధాలను నెమరేసుకుందాం. రాశిచక్రంలో గురుడు రాశి మారినప్పుడల్లా మన పుణ్యనదులకు పుష్కరాలు వస్తుంటాయి. మే 15 నుంచి 26 వరకు సరస్వతీనదికి పుష్కరాలు రానున్నాయి. పుష్కరాల విధులను మన తెలుగువారు తప్పక పాటిస్తుంటారు. ఆ పుణ్యసమయంలో నదీస్నానం, దానాలు చేస్తుంటారు. మనదేశంలో సరస్వతీనది ఎండిపోయినప్పటికీ... కొన్నిచోట్ల ఆ నది ఆసవాళ్లు గుర్తించారు. తెలంగాణలోని కాళేశ్వరంతో పాటుగా ఆయా ప్రదేశాల్లో పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఆ నదీమ తల్లి మనల్ని కరుణించాలని వేడుకుందాం.