bhakthipathrika

చలిని పూర్తిగా వదిలించి... చిరుఎండలు కాసే తరుణం మాఘమాసం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 27 వరకు మాఘమాసం. ఇది ప్రధానంగా కల్యాణాల మాసం. శివుడు, విష్ణువు, శక్తి అనే భేదం లేకుండా అనేక దేవాలయాల్లో జాతరలు, కల్యాణాలు, ఇంకా అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది మన సంస్కృతిలోని ఏకత్వ భావనకు అద్దం పడుతోంది. ఈ మాఘమాసంలోనే సరస్వతీ ఆరాధన, సూర్యారాధన కూడా విశేషంగా జరుగుతాయి. చదువుల తల్లి సరస్వతీదేవిని ఫిబ్రవరి 2న వసంతపంచమి పేరిట పూజిస్తారు. అనాడు సరస్వతీ ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తుంటారు. ఇక ఫిబ్రవరి 4న రథసప్తమి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుడి శికరంగా జిల్లేడు ఆకులు, రేగుపళ్లు శిరస్సుపైన, భుజాలపైన ఉంచుకుని స్నానం చేయమని పెద్దలు చెబుతుంటారు. ఉదయాన్నే చిక్కుడు ఆకుల్లో సూర్యునికి పాయసం నివేదించే పర్వమిదే. రథసప్తమి సందర్భంగా ఏడుకొండలపై శ్రీవారికి రథోత్సవం జరుగుతుంది. ఇంకా అనేక ఆలయాల్లో రథోత్సవాలు నిర్వహిస్తారు.

శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి

...ఈ శ్లోకం శివుడిని సాకారంగా వర్ణిస్తోంది. ఆయన లక్షణాలు అన్నింటిలోనూ శాంతస్థితినే గొప్పదిగా పేర్కొన్నారు. శాంతానికి ప్రతీకగానే ఆయన అనేక ఆయుధాలను ధరించి ఉంటాడు. స్పటికంలా మెరిసిపోతాడు. అటువంటి శివుడిని ఆరాధించుకునే మహాశివరాత్రి మహాపర్వదినం ఫిబ్రవరి 26న వస్తోంది. ఆనాడు దేశంలోని శివక్షేత్రాలన్నీ శివనామంతో మార్మోగుతుంటాయి. అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాలలో శ్రీ శైలం, శ్రీ కాళహస్తి వంటిచోట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జన్మకో శివరాత్రి అని సామెత. బోళాశంకరుడు శివరాత్రి ఉపవాస, జాగరాలతో ప్రసన్నుడవుతాడని విశ్వాసం. చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తే... మురిసిపోయి వరాలు కురిపిస్తాడని పెద్దలు చెబుతారు.

Read More